మహాకవి కాళిదాసు

Hiduism @pexels
Reading Time: < 1 minute

మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి ‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. ‘మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి.. ‘మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.

అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి.. ‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. ‘మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’ అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. ‘మాతా నీళ్లు ఇవ్వండి. దాహంతో చనిపోయేలా ఉన్నాను..’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి.. ‘మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా.. ‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు. ‘మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది. కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.

ఓపిక నశించిన కాళిదాసు.. ‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ.. ‘ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ  బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.

విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి

Leave a Reply