భగవంతుడి లీలలు

Hindu God Lord Ganesha @pexels.com
Reading Time: < 1 minute

భగవంతుడి లీలలు

ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. 

ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నారు. 

గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. 

 ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను. 

ఏమిటా కోరిక గురువు గారూ 

తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. 

వచ్చే జన్మలోనా 

కాదు ఈ జన్మలోనే 

శిష్యుడు పగలబడి నవ్వాడు, గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా?

 అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా 

 అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు.

ఆది విని   ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు. అన్నారు గురువుగారు.

ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 

శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

సరిగ్గా, సంవత్సరం తరువాత...

ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువు గారూ.. ఈ వింత విన్నారా…!
శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!! అన్నాడు.

దానికి గురువు గారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా.. అన్నారు.

అంటే..?? అడిగాడు శిష్యుడు.

అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో
ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 

శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 
భరతుల వారు ‘పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.
ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది. 

అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 
 సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది., 
కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.


Leave a Reply