చల్లా రాజేంద్ర ప్రసాద్

Coffee Cup @pexels
Reading Time: 3 minutes

ప్రపంచంలో ఎక్కువ మంది కాఫీను త్రాగటానికి ఇష్టపడినప్పటికీ, భారతీయులు టీ త్రాగటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అంతలా టీ త్రాగే దేశంలో, 1985 లో ఒక యువకుడు కాఫీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి ప్రపంచవ్యాప్తంగా కాఫీను వినియోగించే వారి కళ్ళను తనవైపు తిప్పుకోవాలని కలలు కన్నాడు.

అతడే చల్లా రాజేంద్ర ప్రసాద్.

భారతదేశంలో ఒక కాఫీ ప్లాంట్ స్థాపించి, తద్వారా కాఫీ ముడి పదార్ధాలకు బదులుగా విలువ-ఆధారిత కాఫీను ఎగుమతి చెయ్యడం, గ్రామాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం, మరియు భారత ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చడం వంటి బహుళ లక్ష్యాలను సాధించాలి అనే ఉద్దేశంతో చల్లా రాజేంద్ర ప్రసాద్ తన పారిశ్రామిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ కలను సాకారం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. భారతీయ పరిశ్రమలన్నీ లైసెన్స్ రాజ్ అధీనంలో ఉండేవి. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే భారతీయులకు ప్రోత్సాహం ఉండేది కాదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ చల్లా రాజేంద్ర ప్రసాద్ ధైర్యముగా ముందడుగు వేశారు. అతను లైసెన్స్ కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖను కలిశారు. అయితే అతని ప్రయత్నాలకు వాళ్ళనుండి ఎటువంటి ప్రోత్సాహం దొరకలేదు. అతనిని ముందుగా కాఫీ బోర్డుతో మాట్లాడమని చెప్పి పంపించేశారు. అతని ఆలోచనలను కాఫీ బోర్డు చూడలేకపోయింది అలానే కాఫీ బోర్డు, ఇన్స్టంట్ కాఫీ విభాగాన్ని ఎక్కువగా MNC లకు కేటాయించింది.

ప్రోత్సాహం లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న కాఫీ బిజినెస్‌ను అర్ధం చేసుకోవడానికి చల్లా రాజేంద్ర ప్రసాద్ తన ప్రయాణాన్ని ఆరంభించారు. అతను కాఫీ మార్కెట్‌ను అధ్యయనం చేస్తూ కాఫీ ఇండస్ట్రీలలో స్నేహితులను ఏర్పరచుకున్నారు. కాఫీ ఇండస్ట్రీలలో తాను సంపాదించిన అనుభవం, తాను ఏర్పరచుకున్న పరిచయాలతో తన కలను నెరవేర్చుకోవడానికి ఉత్సాహంగా భారతదేశానికి తిరిగివచ్చారు.

ఇప్పుడు చల్లా రాజేంద్ర ప్రసాద్‌ను ఆపేది ఏమీ లేదు. 1989 లో భారతదేశంలోని తూప్రాన్ ప్రాంతం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఉపాధి కల్పించేలా తూప్రాన్ గ్రామంలో కాఫీ ప్లాంట్‌ను నెలకొల్పారు. అదే Asian Coffee Ltd మరియు అతను దానికి ప్రమోటర్-మేనేజింగ్ డైరెక్టర్. Asian Coffee Ltd ఇన్స్టంట్ కాఫీని ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే మొట్టమొదటి పూర్తి స్థాయి ఇండియన్ కంపెనీ. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన కామన్‌వెల్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యొక్క సహాయాన్ని పొందిన మొదటి భారతీయ కంపెనీగా గుర్తింపు పొందింది. అయితే వాటాదారుల నుండి టాటా బెవరేజెస్ వాటాలను కొనుగోలు చెయ్యడంతో Asian Coffee Ltd తో ఉన్న తన అనుబంధం ముగిసింది. అయినప్పటికీ అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు.

Closeup Photography of Coffee Beans
Coffee Beans @pexels

ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లోని దుగ్గిరాలలో చల్లా రాజేంద్ర ప్రసాద్ మరింత ఆధునికరణతో కొత్త కాఫీ ప్లాంట్‌ను స్థాపించారు. అదే Continental Coffee (India) Ltd (తరువాత అదే CCL Products (India) Ltd. గా మారింది). అతను దానిని ఒక విజయవంతమైన కంపెనీగా నిలబెట్టాడు. భారతదేశంలో సాధించిన ఈ విజయంతో అతను సంతృప్తి పడకుండా, CCL Products (India) Ltd యొక్క 100% అనుబంధ సంస్థలుగా స్విట్జర్లాండ్ మరియు వియత్నంలో ప్లాంట్‌లను నెలకొల్పారు. 2019 లో ఆంధ్ర ప్రదేశ్‌లో SEZ ప్లాంట్ స్థాపించడంతో కీర్తి పతాక స్థాయికి చేరింది.

గడిచిన 25 సంవత్సరాలుగా, భారతదేశంలోని రెండు ప్లాంటులు మరియు స్విట్జర్లాండ్, వియత్నంలలో స్థాపించిన ప్లాంట్‌లతో 50000 మెట్రిక్ టన్నుల కాఫీ మరియు ఇతర సంబంధిత ఉత్పత్తులను ఉత్పత్తి చేసే స్థాయికి చల్లా రాజేంద్ర ప్రసాద్ ఎదిగారు, తద్వార CCL ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ లేబుల్ కాఫీ తయారీ సంస్థగా మారింది. ఈరోజు పూర్తి స్థాయి కాఫీ ఉత్పత్తులతో CCL కాఫీ 90 దేశాలకు చేరింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకండ్‌కు 1000 కప్పుల కాంటినెంటల్ కాఫీ అమ్ముడవుతోంది. CCL యొక్క స్థిరమైన అధిక స్థాయి ఎగుమతులు అనేక ఇండియన్ కాఫీ బ్రాండ్‌లకు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఈ బ్రాండ్ ‘మేక్ ఇన్ ఇండియా’ విలువలతో, భారతదేశంలో ఇన్స్టంట్ కాఫీను ఎక్కువగా ఎగుమతి చేసే సంస్థలలో ఒకటిగా పేరుగాంచింది. కాఫీ మరియు భారతదేశంపై తనకున్న ప్రేమతో, CCL దేశీయ మార్కెట్‌లో తన సొంత కాంటినెంటల్ కాఫీ బ్రాండ్‌లను ప్రారంభించింది, ఫలితంగా ‘మేక్ ఫర్ ఇండియా’ లో కూడా తనదైన ముద్రను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. తక్కువ కాలంలోనే, ఈ బ్రాండ్ భారతీయ వినియోగదారులను ఆకర్షించింది, అది ప్రతీ ఒక్క భారతీయుడికి అత్యుత్తమ కాఫీను అందించేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని CCL కు అందించింది.

Continental Coffee Product Line
కాఫీ రంగంలో చల్లా రాజేంద్ర ప్రసాద్ యొక్క అద్భుత పనితీరు ఫలితంగా భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ, అతనిని చాలా సార్లు కాఫీ బోర్డు సభ్యునిగా నియమించింది.

చల్లా రాజేంద్ర ప్రసాద్ గొప్ప మార్గదర్శి మరియు ప్రపంచ మార్కెట్‌లలో భారతీయ సాల్యుబల్ కాఫీను నిలబెట్టిన మొదటి పారిశ్రామిక వేత్త. ప్రపంచ కాఫీ పరిశ్రమలలో అతని పారిశ్రామిక స్ఫూర్తి మరియు సాధించిన అద్భుత విజయాల ఫలితంగా, 2019 లో జర్మనీ లోని అనుగాలో ఇన్స్టంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన వరల్డ్ ఇన్స్టంట్ కాఫీ డిన్నర్ మీట్‌లో చల్లా రాజేంద్ర ప్రసాద్‌ను “లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు” తో గౌరవించారు. కాఫీ పరిశ్రమకు అతను చేసిన సహకారంతో, ప్రపంచంలోనే ఎక్కువగా కాఫీను ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.

Leave a Reply