Site icon Chandamama

శని శింగనాపూర్ దివ్య చరిత్ర

Lord Shani
Reading Time: 2 minutes

భారతదేశం, మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం. శింగనాపూర్ షిరిడి మరియు ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి దైవము “స్వయంభు” అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని, గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపురుల ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. నోటి మాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభు ( =సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన) యొక్క కథ ఈవిధంగా సాగుతుంది: గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దానినుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్బ్ర్హాంతి చెందగా, వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూచేందుకు గుమికూడింది. ఆ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలు గల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను “శనీశ్వరుడి”నని చెప్పెను. అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని కుడా ఆయన చెప్పినాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించ వలెనేమో అని అడిగెను. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజూ పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను. అంతేకాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసే వారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను.

అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును. ఈ రోజు వరకు ఏ ఇంటికి, దుకాణముకు, ఆలయముకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల ప్రసక్తి లేకపోవడం మనం చూసి నమ్మవచ్చు. శనిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శని శింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శనిశింగనాపూర్‌ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా ‘అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

Exit mobile version